"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 అక్టో, 2011

తిత్లీ...

తిత్లీ...తిత్లీ...అమ్మ కేకలు ..దూరం నుంచి..మున్నాకి పాలు పట్టేవా??
ఆ..ఆ..ఇప్పుడే అమ్మా..ఇదిగో..

చెయ్యంత..అంటే నా చెయ్యి కాదు,అమ్మ చెయ్యంత పూసిన సూర్య కాంతం పువ్వు,పచ్చగా విచ్చుకుని, సూర్యుడి మొహం లోకి చూస్తోంది.నేను ఒక్క క్షణం కూడా అలా చూడ లేనే..అంటూ..విస్మయం తో,ఆ పూమొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను..నాకు పువ్వులంటే ప్రాణం.

నా మొహం కూడా పువ్వు లా ఉంటుందని, అమ్మ అంటుంది, రాత్రి, నన్ను ముద్దు చేస్తూ.. తమ్ముడు మున్నా ఎలా ఉంటాడు? అంటే చందమామ లాగా అంటుంది..మా అమ్మ..

పచ్చ గా కనిపించే ఆ ఆవాల మడి లో దూరం గా అమ్మ ఎర్రని చీర లో వంగి పని చేస్తూ ఉంటే...ఎంత బాగుందో? నాన్న ఇంకా దూరం గా ఉండే అడవి లోకి వెళ్ళాడు.

కట్టెలు కొట్టి తేవాలి కదా..రాత్రి కి అమ్మ పొయ్యి అంటించి, కుండ లో అన్నం వండి, ఏదో కూర వండుతుంది..ఆ కూరలు కూడా..మా ఇంటి వెనక పెరడు లోనే పండుతాయి.

నాన్న ..అమ్మ చెయ్యి బంగారం..అంటాడు.

అమ్మో..మున్నా కి పాలు పట్టాలి..

మేం ఆరు నెలలు ,కష్ట పడి, పంట పండించి..బస్తా లోకి ఎక్కించే టైం కి,ఎక్కడి నుంచో వస్తాడు..మోటార్ సైకెల్ మీద మీసాలున్న ఓ పెద్ద మనిషి, అమ్మా..నాన్న ఒంగి ఒంగి దణ్ణాలు పెడతారు..

చేతిలో కొన్ని నోట్లు పెట్టి, బస్తాలు బండి లో కి ఎక్కించుకుని ..ఏమైనా కూరలు ఉన్నాయా..అని పెరట్లో కాసిన కూరలు కూడా చేసంచి లో వేసుకు వెళ్ళిపోతాడు..

అమ్మా నేను..ఒకరి మొహం లో ఒకరు చూసుకుంటాం...

ఎందుకమ్మా..మనం పండించెం కదా..అంటే..ఈ భూమి మనది కాదు తిత్లి అంటుంది..అమ్మా..

అన్నట్టు నేను చెప్పలేదు కదా.. మేం కోసి నది పక్కనే ..ఓ చిన్న ఊరు లో ఉన్నాం.

మా ఊరు అసలు ఇది కాదు..అని ఏవో కథలు చెప్తూ ఉంటుంది.అమ్మా..

ఇంతలో వర్షా కాలం..వచ్చింది.పొలం నిండా నీళ్ళు..అమ్మా.నాన్న కళ్ళల్లో కూడా నీళ్ళే..

మున్నా ఏడుస్తున్నాడు పాల కోసం..

నేను ఆకలి వేసినా ,అమ్మా ని అన్నం పెట్టమని అడగ లేదు,ఇంకా పొయ్యి అన్తించలేదు మరి..

రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది..ఒక్క రాత్రే కాదు, ఎన్నో రాత్రులు.
మైలు దూరం లో ఉండే కోసి నది, ఉప్పొంగి..రాత్రి..ఇంటి నిండా నీళ్ళు..

అమ్మా చేయి నే పట్టుకున్నాను..నాన్న మున్నా ని ఎత్తుకున్నాడు..నీళ్ళల్లో నడుస్తూ, తేలి పోతూ..చుట్టూ చీకటి, ఎప్పుడూ కోసి నది ఇలా ఉప్పొంగ లేదు, ఈ ఊరు చాల దూరం..అని నాన్న చెపుతున్నాడు..అమ్మా తో..మన దురదృష్టం..ఇక్కడ కూడా వెంటాడుతోంది. అన్నాడు..

నాన్న ,అమ్మా అసలు ఊరిలో కరువు వచ్చి, ఈ ఊరు వచ్చి..భూమి తీసుకుని, పంట వేస్తున్నారు..

ఎంత దూరం వెళ్ళామో..ఆ చీకట్లో..ఆ నీళ్ళల్లో..

అయ్యో..మున్నా..మున్నా..ఆ నీటి వరదలో తమ్ముడు..నీటి పాలయ్యాడు,ఎప్పుడో జారి పోయాడు, నాన్న భుజం మీద నుంచి.

నడిచి, నడిచి..ఒక ఊరు జేరాం..

మాలాంటి వారే..ఎంత మందో...

మోటర్ సైకెల్ ఆయన వచ్చి, కాయితాల మీద సంతకం పెట్టించుకుని, నాన్న చేతి లో రెండు వందల రూపాయల నోట్లు పెట్టి వెళ్లి పోయాడు.

అమ్మా అంది నాతొ..ప్రభుత్వం ఇచ్చే పరిహారం అన్ని అతనికే..మనకి కన్నిల్లే..మిగిలాయి అని.

ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళా లో అని ..దిగులుగా కూర్చున్నాం.

ఇంతలో దేవుడు లాగ..ఇంకో పెద్ద మనిషి వచ్చాడు..వ్యవసాయం చేస్తారా అని అడిగాడు. సరే అన్నాడు నాన్న..నాన్నకి వచ్చిన పని అదే కదా.

సరే అంటే,మూడు టికెట్లు చేతిలో పెట్టి, ఫలానా ఊరు వెళ్ళమని నాన్నకి, చెప్పి,కొంత డబ్బు కూడా ఇచ్చేడు.

రెండ్రోజులు రైలు లో ప్రయాణం చేసి, మేం ఉండాల్సిన ఊరు కి వచ్చాం..ఆ ఊర్లో మరో ఆయన వచ్చి..మా పొలం చూపించాడు..అంతా చెట్లు, రాళ్ళు..అవి కొట్టి..సాగు చేసుకోమన్నాడు.

నేనూ,అమ్మా..మాకు ఇచ్చిన చిన్న పాక చుట్టూ దడి కట్టుకుని, నేను పూల మొక్కలు అమ్మ కూర గాయల మొక్కలు వేసుకున్నాం.

నాన్న భూమి సాగు చేయడానికి,పగలు రాత్రి, కష్ట పడి..చెట్లు కొట్టి, రాళ్ళు పగల గొట్టి, నీరు మోసుకు వచ్చి, ఎలాగో,ఆరు నెలలకి ..ఒక దారి కి తీసుకు వచ్చాడు.

ఒక రోజు అమ్మ అంటోంది, నాన్న తో..

ఏమయ్యా..ఈ భూమి..ప్రభుత్వం ది ట..అర మైలు దూరం లో అంతా క్రూర మృగాలు,పులులుండే  అరణ్యం   ట..మనల్ని ఇక్కడ కూడా ఉండనివ్వరేమో?

అంతా ఆ పెద్ద మనిషే చూసుకుంటాడు..అతనే కదా మనని ఇక్కడ పెట్టేరు.
అంటే..అమ్మ నిట్టూర్చింది .

అమ్మ కి ఓపిక తగ్గింది,మున్న మీద బెంగ, దిగులు తో అనారోగ్యం.

నేను అడవి కి వెళ్లి, చిట్టి కొమ్మలు నరుక్కుని, తల మీద ఎక్కించుకుని, తెచ్చి పడేస్తాను.నేనే పొయ్యి కూడా అంటించి, అమ్మ కి సాయం చేస్తున్నాను.పెద్ద దాన్ని అయాను కదా..

అమ్మ బువ్వ వండుతుంది. అయ్య అలసి పోయి వచ్చి, అన్నం తిని పడుకుంటాడు..

ఒక రోజు..ఎండ చిట చిట పడు లాడు తోంది. ఏమిటో ఎక్కడా ఎండిన కంపే దొరక లేదు..అలా ..నడుచుకుంటూ, పిట్టలని చూస్తూ..అడవి లోపలి వెళ్ళిపోయాను.

ఒక పొద లో, పచ్చని చారలు.పొంచి ఉన్న పులి పంజా..నా మీద పడింది..ఆకలి గా ఉన్న పులి కి ఆహరం అయిపోతున్నాను.

రేపటి నుంచి, అమ్మకి ఎవరు తెస్తారు?అమ్మకి పొయ్యి లోకి కట్టెలు?

అమ్మ ఏమనుకుంటుందో?? ప్రకృతి..మనిషి పగ పెట్టేరు, మూగ జంతువుల కి  కూడా మా మీద ఇంత పగేమిటి..దేవుడా??అని ఏడుస్తుంది..

తిత్లీ ..మనసు లో ఆఖరి కోరిక..మా అమ్మ-నాన్నలకి ఈ సారైనా ,ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందుతుందా??


ఎందఱో,భూమి లేని, భూ పుత్రుల కి అంకితం..

2 కామెంట్‌లు:

  1. క్షణం పాటు చలనం లేదండీ ఈ కథ చదివాక....
    చాలా బాగా చెప్పారు

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ Maddy gaaru.. ..రెగ్యులర్ గా నా కథలు, కమామీషూ లు చదివి, కామెంట్ కూడా రాసి, ప్రోత్సహిస్తున్నందుకు..నేను చదివే వార్తా ల లో,నన్ను కదిలించే వాటినే, చిన్న కథలు గా రాస్తున్నాను. మళ్లీ, మరొక్కసారి ధన్య వాదాలు. రచయిత /త్రి కి కావాల్సింది, ఒక బాగుందనే ..మాట..అదే ఒక అవార్డ్.అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.
    వసంతం.

    రిప్లయితొలగించండి