"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 అక్టో, 2011

ఉనికి

ఉదయం ఎనిమిది..పిల్లలని, భర్త శ్యాం ని స్కూల్ కి, ఆఫీసు కి పంపించే హడావిడి, అష్టావధానం ..చేస్తున్నట్టు నాలుగు చేతుల తో పని చేస్తున్నట్టు ..ఉంది శాంతి కి.
ట్రింగ్ ..ట్రింగ్..అని డోర్ బెల్ మోగింది.
అబ్బ,ఈ టైం లో తలుపు తీసి..మాట్లాడ డమా??
ఏమండి, మీరు చూడండి.
నేను బట్టలు వేసుకుంటున్నాను. నువ్వే చూడు.
"ఏమిటి? ఎవరూ.." అంటూ విసురు గా తలుపు తీశాను.
మా అపార్ట్ మెంట్ వాచ్ మాన్.నాయుడు.
శ్యాం..మా  అపార్ట్ మెంట్ వాసుల బాగోగులు చూసే సొసైటి కి సెక్రెటరీ.
"అదేమిటి నాయుడూ..ఈ టైం లో వచ్చావు?
సాయంత్రం సమయం లో రాకూడ దా? ఇప్పుడు చూస్తున్నావు గా ఎంత బిజీ ?"
"అయ్యగారికి ఒక విషయం చెప్పి వెళ్లాలని వచ్చాను ..ఈ శుక్రోరం మా ఊరు చీపురు పల్లి లో ఎలెక్షన్ల పండగండి. ఒక్క అయిదు వందలు బయాన ఇప్పిస్తే, మేం వెళ్లి ఓటు వేసి వస్తాం. ఈ విషయమే చెప్పాలని అయ్యగారికి, మళ్లీ  వస్తాను"..
"సరే నేను చెప్తాలే.." అని పంపించేసేను.
ఉదయం అందరిని పంపించి ఇల్లు సద్దు కుంటున్నాను.మళ్లీ డోర్ బెల్ ట్రింగ్..ట్రింగ్..తలుపు తీశాను.
నాయుడు భార్య నరసమ్మ.అచ్చమైన  తూర్పు కట్టు..అంటే చీర నే గట్టిగ ఒక చుట్టూ చుట్టి,కట్టు కుంటారు. రవిక అంటూ వేరే ఉండదు..మనిష్ మల్హోత్రా చూస్తే..ఏ ఐశ్వర్య రాయ్ కో డిజైన్ చేస్తాడేమో..అనుకుంటూ ఉంటాను.
గేట్ దగ్గర పని, ఇళ్ళల్లో పనులు అయ్యాక , నోట్లో ఒక చుట్ట పెట్టుకుని మహా దానందం అనుభవిస్తూ ఉంటుంది. కాన్సెర్ అంటూ, ఏవో చెప్పేను కాని, తల కెక్కదు  వాళ్లకి, నీకు ఎందుకు కంఠ శోష? అంటాడు శ్యాం.
"పని అయిందా అమ్మా"? అంటూ నేల మీద చతికల పడింది.
అంటే ఏదో పెద్ద కథే ..


"ఏం లేదు అమ్మా..మావు మా ఊరేలుతున్నాం కదా, మీరు ఆ బయాన ఇచ్చేటప్పుడు నాయుడు కి చెప్పండి కూంత. మా పొలం మీద అప్పు తీరాలంటే, నేనూ ఆ బిల్డింగ్ కూలి పనులు కి యేలితే తొరగా నాలుగు డబ్బులు ఎనకేసి , అప్పు తీర్చి భూమి సొంతం చేసుకో వచ్చు.
మా ఊర్లో నాయుడ్ల ఆడోల్లు ఇంట్లో పనులే చేసుకుంటారు, కాని పట్నం లో వొవరు సూత్తారు? ఏంటో నాయుడు సాదస్తం..ఇళ్ళల్లో పని సాలు ..చ ,ఊరులో తెలిస్తే కులపోల్లు ఏటంటారు? గమ్మునుండు..అని కసిరేస్తాడు అమ్మా..మీరే కూసింత చెప్పాలి.."

హు..నేను శ్యాం కి చెప్పడం, శ్యాం నాయుడు కి చెప్పడం..ఇన్ డైరెక్ట్ చానెల్స్ ఎన్నో..ఏమిటో ఈ నరసమ్మ పంతం..పోనీ తనే ఏదో చెప్పి ఒప్పించు కోవాలి, ఇంట్లో విషయాలు ,మనం ఏం చెప్తాం ? అన్నీ నీకే కావాలి ...శ్యాం నాకు చెప్పే పాఠం ..వినిపించింది నాకు అప్పుడే..

సాయంత్రాలు..పిల్లలతో కూర్చుని హోం వర్క్ లు చేయించడం, మధ్యలో వెళ్లి, స్టవ్ మీద పెట్టిన కూర చూడడం, ఇంట్లో విశ్రాంతి గా కూర్చుని, ఉదయం సమయం ఉండదని, ఇప్పుడు తీరుబడి గా హిందూ న్యూస్ పేపర్ చదువుతూ, " చూసావా, ఈ వార్త, "అంటూ శ్యాం చేసే వ్యాఖ్య లని, ముసి ముసి గా నవ్వుకుంటూ, వినడం, నేను చదివిన పేపర్ ఏ కదా..నాకు కొత్త గా ఏముంటుంది? హు..ఏ ఊర్వశి అవార్డులే ఇచ్చేయ వచ్చు, ఈ భర్త ల ఎగో తృప్తి పరచడానికి భార్య లు నటించే అమాయకత్వం నటనల కి,ఇది తెలియక కొందరు అమాయక స్త్రీలు , ఉత్తి పుణ్యానికి విడాకులు ,తెగతెంపులు అంటూ కోర్టుల గుమ్మం ఎక్కుతారు, అయినా ప్రేమ , నమ్మకం ,ఆప్యాయత లు పునాది గా ఉంది ..మా దాంపత్యం లో..

ఆఖరికి వచ్చే కూర అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే నాకు, కూర ముక్కలు అన్నీ, అతుక్కుని ఒక ..ఒకే రూపం,ముందుగా విడి విడి గా ఉన్న ముక్కలే కదా..దాంపత్యం కూడా ఇలాగే ..ఇలా ప్రతి దాంట్లో, నాకు ఏవో కొత్త కొత్త విషయాలు కనిపిస్తాయి..ప్రతి దాంట్లో నాలోని రచయిత్రి కి ఏదో ఉపమానం కనపడుతూ ఉంటుంది,నీకు మరీ ఆలోచనలు, ఊహలు ఎక్కువ....శ్యాం..ఇలా ప్రతి ఆలోచన కి మాట కి పక్క శ్యాం అనుకుంటూ ఉంటాను, ఎంత పిచ్చి దానివే శాంతా ..అని నాలో  నేనే..స్వగతం..

ఇలా పనులు ,ఊహలు, కలబోసి నేను వంటింట్లో పని చూసుకునే సమయం లో ఎప్పుడో నాయుడు రావడం, శ్యాం అయిదు వందలు ఇవ్వడం.నాయుడు .ఓ దణ్ణం పెట్టి వెళ్ళిపోవడం..అన్నీ జరిగి పోయాయి..
నరసమ్మ మాటలు గుర్తు వచ్చాయి..ఇంతలో భోజనాలు..నిద్ర, ఉదయం కి మళ్లీ పనులు..
మర్నాడే ఎలెక్షన్ రోజు, మా ఎం పి గా ఎవరు నిల్చున్నారో? వారి చరిత్ర ఏమిటి? అని మా స్నేహితులం అందరూ ఇవే మాటలు, శ్యాం ఆఫీసు లో కూడా ఇవే మాటలు ట. ఇద్దరి కి ఇద్దరే,రెండు పార్టీలు సమానం గానే దోచుకున్నాయి, ఇంకా ఇప్పుడు ఎవరికీ ఇవ్వాలి ఆ అవకాసం అనేది ఎన్నిక ద్వారా తేలుతుంది.
ప్చ్..ఇవా ఎలక్షన్లు అంటే..ఏమిటో ఈ పార్లమెంటరీ వ్యవస్థ మీదే నమ్మకం పోతోంది. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది..బిట్వీన్  డెవిల్ అండ్ డీప్ సీ..అని ఎందులో దూకడం??
మాకు మూడు రోజులు సెలవులు, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం..అరకు వెళ్లి వచ్చేద్దామా? అని తర్జన భర్జనలు.
సాయంత్రం నాలుగు కి, నాయుడు, పైకి వచ్చి తలుపు కొట్టి, గేట్ తాళాలు అవి అప్ప చెప్పాడు. బంధువుల అబ్బాయిని పెట్టేనని, మూడ్రోజులు సెలవు అని చెప్పి.వాళ్ళ .ఊరికి బయలు దేరారు. బాల్కనీ లోంచి కిందకి చూస్తున్నాను.

ఎప్పుడూ ఒక తుండు కట్టుకుని, పైన ఒక బనీను వేసుకుని, ఉదయమే  సూర్య నమస్కారం చేస్తూ, ఏవో మంత్రాలు చదువుతాడు కూడా, చెప్పుకుంటే సిగ్గు, నాకు ఒక్క మంత్రం కూడా నోటికి రాదు, పుస్తకం ముందు పెట్టుకోవాల్సిందే..నాయుడు ఇవాళ చక్కగా పంచ కట్టి, ఒక పై పంచ తల కి చుట్టి, పైన శుభ్రమైన చొక్కా ఒకటి వేసుకుని, సరి అంచుల చీర చుట్టి, భుజం మీదు గా..నాయుడి భార్య ,నాయుడు ,నరసమ్మ ..అచ్చం గా ఎంకి -నాయుడు బావ లా ఉన్నారు.
వాళ్ళ ఊరు సీపురుపల్లి కి కదిలారు..జంటగా.
మర్నాడే మేం అరకు ప్రయాణం ..పిల్లలతో, ఎన్నాళ్ళకో దొరికింది ఇలా మూడు రోజుల సెలవుల విందు..
అరకు అందాలు..బొర్రా గుహల సంభ్రమం, చాప రాయి జలపాతాల గల గల లలో మునిగి తేలి , అలసి సొలసి, ఆదివారం రాత్రి పది గంటలకి చేరాం ఇంటికి. మర్నాడే స్కూల్, ఆఫీసు ,అమ్మో ఎన్ని పనులో..
సోమవారం ..ఎలా ఉంటుందో ..అలాగే బద్ధకం గా ..తెల్లవారింది.
పిల్లలి ని స్కూల్ బస్సు ఎక్కించి ఇంటికి వస్తున్నాను.
నరసమ్మ తళ తళ లాడే స్టీల్ కారేజ్ పట్టుకుని, ఎదురయింది.
ఎక్కడికే? అప్రయత్నం గా అడిగాను.
"పనిలోకి..అమ్మా" ముసి ముసి గా నవ్వుతూ..
నాయుడు కి మేం ఏమి రికమండేషన్ చేయలేదే??
నా మొహం లో కనిపించే ప్రశ్న లకి సమాధానం గా..
" మాం సీపురు పల్లి ఎల్లి పోయినామా..ఓట్ల పండగ నాడు, నాయుడు నేను ఎల్ల బోతే, మా పేర్లే లేవంట ..ఊరంతా తిరిగేం..మీరు ఊరి విడిచి అయిదేళ్ళు పై అయింది గా..ఇంక ఈ ఊరు తో మీకు ఏం సమందం లేదనేసారు ..అమ్మా..నాయుడు అయితే కూలిపోయ్యాడు..మా ఊరే ఇది కదా..వ్యోవసాయం కుదరక ,అప్పులు ఎక్కువై ఇలా పట్నం కి పారోచ్చినాం..మా భూవి, ఇల్లు అన్నీ అక్కడనే కదా..ఈ పట్నం లో ఏం ఉంది మాకు? ఆ మెట్ల కింద కూసింత నీడ.."

"నా పేరే లేదు ట.నేను ఆ ఊరోడినే కాదంట. అంటూ తెగ ఏడుపే అమ్మా నాయుడైతే, రెండో రోజుకే వోచేసాం అమ్మా..మీరు లేరు కదా..మీకు తెలీదు.
నీ ఇష్టమే..సేసుకో ఆ కూలి పనులు..ఏవో? మనూరి నాయుడ్నే కాదన్నారు. ఇంక ఏటుంది ఈ పట్నం లో మన పరువు? నీ ఇష్టం ..నీ ఇష్టం..అంటూ"
"ఈ రోజే పని లోకి ఎల్తున్నా అమ్మా.."
అంటూ మెరుస్తున్న స్టీల్ కారేజ్ గర్వం గా పట్టుకుని ..
వెళుతున్న నరసమ్మ ని చూసిన నా మనసు లో..చిక్కు పడిన ఎన్నో ఆలోచనలు?
ఓటు కోసం మూడు గంటలు ప్రయాణం చేసి , ఓటు లేదని తెలిసి బాధ పడుతున్న ,నాయుడు , మేస్త్రి పనులకి బయలు దేరిన నరసమ్మ, మూడు రోజులు సెలవులు వచ్చాయని విహార యాత్ర వెళ్లి వచ్చిన మా కుటుంబం..పక్కనే ఓటు పెట్టుకుని, వేయని మా అలసత్వం..ఏమిటో ??ఎక్కడో ఏదో చిక్కు ముడి విడి పోతునట్టు ఉంది..మళ్లీ నా చదువు వల్ల వచ్చిన అహంకారం ..ఒప్పుకోదు..
ఎన్నికలు, ఓట్లు..ఎన్నుకోవడం..ఆలోచించాలి..మరింత ఆలోచించాలి..
అనుకుంటూ..మా మేడ మీద మా గూడు లోకి ప్రవేసించాను..మా పొదరిల్లు..పదిలమైన మా పొదరిల్లు.








6 కామెంట్‌లు:

  1. నిజం చెప్పారు...

    ఓట్లు వేయటంలో పల్లెలో ఉండేవారు... పట్టణాలు ,నగరాల్లో ఉండేవాళ్ళ కన్న చాలా చాలా Great...

    నేను కూడా ఆలోచించాలి...

    రిప్లయితొలగించండి
  2. ఒక ఆలోచన దీపం వెలిగించినా చాలు, రచయిత (త్రి) ఆశయం ఫలించినట్టే..థాంక్స్ రాజేష్ గారు, నా కథ చదివి, మీ అభిప్రాయం రాసినందుకు.

    వసంతం

    రిప్లయితొలగించండి
  3. చదువుకున్న వాళ్ళే ఓట్లెయ్యడం లేదని ఒక సర్వేలో తేలిందిట.
    మీ కథ దానిని నిజం చేసింది...

    రిప్లయితొలగించండి
  4. అవునండి లలిత గారు..మీరు విన్నది నిజమే, ఒక పామరుడు ఓటు కి ఇచ్చే విలువ మనం పట్న వాసులు ఇవ్వటమ లేదు, దానికి కారణాలు ఎన్నో..నిరాశక్తత, నిరాశ, ఏదోలే ..అని సరి చెప్పుకోవడం..తరువాత ,ఇలాంటి వాడా?మనం ఎన్నుకున్నది అని విచారించడం..నా కథ ..కొంత మంది నయినా ఆలోచింప చేస్తే ..ఫలించినట్టే.
    వసంతం

    రిప్లయితొలగించండి
  5. చదువుకున్న వాళ్ళం అనుకుమే వాళ్ళు అవుసరం అయిన పనులే చేస్తారు. ఏ లబ్ధి లేవనిపించే పనులు వాళ్ళకి అవుసరాలు కావు. ఏమన్నా అంటే లాజిక్కులు తీస్తారు.
    పాపం చదువుకోని వాళ్ళంటారా చేయాల్సిన అన్ని పనులు బాధ్యతగా చేస్తారు. ఇది చేయాలి అంటే నమ్మి నమ్మకంగా ఆ పని చేస్తారు. లాజిక్కులు మాజిక్కులు కోసం యేపనీ యెగ్గొట్టరు.

    రిప్లయితొలగించండి
  6. థాంక్స్ అంది..శ్యామలియం గారు..బాగా చెప్పేరు. చదువు కున్న వారికీ, అన్ని తెలుసు అన్న అహం..కానీ ,మన ఎలక్షున్ల లో ఎప్పుడూ ఓటు వేసేది ..ఒక వర్గమే..అమ్ముడు పోతారు, అది ,ఇది అని చెప్పుకుని, ఇంట్లో కూర్చుంది మనం.చదువు కున్న వారం..నా కథ..కథ కాదు నిజం కూడా..
    వసంతం.

    రిప్లయితొలగించండి